గోదావరిఖని, వెలుగు : కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్ చెప్పారు. గోదావరిఖనిలోని యూనియన్ ఆఫీస్లో గురువారం మీడియాతో మాట్లాడారు. కార్మికుల హక్కులు, జీవనోపాధి భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత పరిరక్షణ కోసమే ఒకరోజు సార్వత్రిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవన్నారు. ఈ చట్టాల వల్ల కార్మిక సంఘాల హక్కులు హరించబడుతున్నాయని, సమ్మె హక్కును సైతం నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహించి శాశ్వత ఉద్యోగాలను తగ్గించడం వల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతోందన్నారు.
కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ధర్మపురి, వికాస కుమార్ యాదవ్, అక్రం, సదానందం, గడ్డం కృష్ణ, పోచయ్య, ఎదులాపురం శ్రీనివాస్, కుషనపల్లి శంకర్ పాల్గొన్నారు.
